ఒక రాజు తన ఆస్థానంలో ఉన్న ముగ్గురు మంత్రులను పిలిపించి.. వారికి ఒక్కొక్క ఖాళీ గోనె బస్తా బ్యాగ్ లను చేతికిచ్చి అరణ్యంలోనికెళ్ళి వాళ్లకు తోచిన పండ్లు,ఫలాలను అందులో నింపి..సాయంత్రం లోపు తీసుకు రావలసిందిగా ఆజ్ఞాపించాడు. మొదటి మంత్రి ఆలోచించాడు..రాజు గారు పండ్లు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండిఉండాలి..కనుక మంచి పండ్లు తీసుకు వెళ్ళాలి..అనుకుంటూ అరణ్యం అంతా తిరుగుతూ పండ్లు నింపసాగాడు. రెండో మంత్రి ఆలోచన..రాజు గారికి పండ్లకి కొదవ లేదు..అయినా మాకు పంపారు..సరే ఏదోలా బస్తా నింపేస్తే చాలు..అనుకుంటూ కంటికి కనిపించిన పండ్లు తాజా,వాడిన,పుచ్చిన భేదభావం లేకుండా నింపసాగాడు.
ఇక మూడో మంత్రి..చాలా చతురంగా ఆలోచించాడు..రాజు గారికి చాలా పనులు..పండ్ల అవసరం అతనికి లేదు.,పై పైన చూస్తే చూడొచ్చు.బస్తా ఖాళీచేసి చూసే సమయం కూడా ఉండదు..చూడనిదానికి కష్టపడి అడివంతా తిరగాల్సిన అవసరం ఏముంది..అనుకుంటూ ఆకులు అలములతో బస్తానింపి..పైన కొన్ని పండ్లతో అలంకరించేసాడు.. సాయంత్రం ముగ్గురూ పండ్ల బస్తాలు తీసుకుని రాజుగారి ముందు హాజరయ్యారు.మూడో మంత్రి ఊహించినట్లే..రాజు గారు చాలా పనుల్లో తలమునకలై ఉన్నారు..కనీసం బస్తాలు వంక చూడనైనా చూడకుండా సైనికులను ఆదేశించారు. ఈ ముగ్గురినీ చెరసాలలో నెల రోజుల పాటు వారి పండ్ల బస్తాలతో పాటు బంధించండి.తినడానికి ఏమి ఇయ్యరాదు..వారు తెచ్చిన పండ్లే వారికి ఆహారం.
ముగ్గురిని చెరసాలలో బంధించారు..మొదటి మంత్రి..చక్కని తాజా పండ్లు మూలంగా ఎలాంటి ఆకలిబాధలు లేకుండా శిక్షాకాలం పూర్తిచేసి తిరిగి ఆస్థానానికి చేరుకున్నాడు. రెండవ మంత్రి..కొన్నిరోజుల వరకు బాగానే తిన్నా..కుళ్ళిన,వాడిన పండ్లు మిగతా రోజుల్లో తిని తీవ్ర అస్వస్థతకు గురై మంచాన పడ్డాడు..శాశ్వతంగా. మూడవ మంత్రి..పైపైన అలంకరించిన పండ్లతో 2 రోజులు గడిపి..ఆకులు,అలములు తో మరో వారం పాటు మాత్రమే గడిపి..పై లోక యాత్రకు వెళ్ళిపోయాడు శిక్షాకాలం ముగిసే లోపే.. కర్మ : మనం చేసిన పనులకు తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది..మంచి కర్మలకి మంచి.,చెడు, పాప కర్మలకు చెడు పర్యవసానాలు తప్పవు. 1000 గోవుల మంద ఉన్నా..దూడ ఖచ్చితంగా తన తల్లి దగ్గరికి ఎలాపోగలదో..మంచి,చెడు కర్మలు కూడా అలానే మనల్ని వెదుక్కుంటూ వచ్చేస్తాయి…!