మానవులు ప్రాచీనకాలంలో సాధారణంగా ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడేవారు. తర్వాతి కాలంలో మాంసాహారం తీసుకొనే అలవాటు చాలామంది మనుష్యులలో వచ్చింది. చాలావరకు ఆహారం మొక్కలు, జంతువులూ అందిస్తాయి. మొక్కల ఆకులూ, పూలూ, కాయలూ, గింజలూ, పండ్లూ అన్నీ ఆహారంగా ఉపకరించేవే. ఇవికాక జంతువుల మాంసం, పక్షులగుడ్లు, పక్షుల మాంసం, చేపలు మొదలైన నీటి జంతువులను నేరుగాను, పాలు, పెరుగు, నెయ్యి మొదలైనడైరీ ఉత్పత్తులనుండి లభిస్తుంటాయి. 2000 జాతుల వరకు పంటల రూపంలో వివిధ దేశాలలో రైతులు ఆహారం కోసం పండిస్తున్నారు. చాలావరకు గింజలు వివిధ రూపాలలో ఆహారంగా ఉపయోగపడతాయి.
చెట్లకు మొలక దశలో కావలసిన ఆహారం విత్తనాలలో సంక్షిప్తం అయి ఉంటుంది కనుక వీటి ఉపయోగం ఆహారంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. పిండిపదార్ధాలను అందించే బియ్యము, గోదుమలు, ఇతర చిరు దాన్యాలు, మాంసకృత్తులనందించే కందిపప్పు , మినపప్పు, శనగపప్పు, పెసలు, అలసందలు మొదలైన పప్పుదాన్యాలు, కొవ్వుపదార్ధాలను అందించే వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, ఆవాలు, పొద్దు తిరుగుడు గింజలు మొదలైనవి, మసాలా దినుసులైన జీలకర్ర, సొంపు, గసగసాలు, దనియాలు, ఇంకా జీడిపప్పు, బాదం, పిస్తా మొదలైన బలవర్దక మైన ఆహారం గింజలనుండి వచ్చినవే. పండ్లు మొక్కలలోని ఆకర్షణీయమైన భాగం వీటి ఆకర్షణలో పడి జంతువులు, పక్షులు పండ్లను తిని గింజలను దూర ప్రాంతాలలో వేస్తాయి కాబట్టి మొక్కల సంతానోత్పత్తి సులభంగా జరుగుతుంది.
గుమ్మడి పండు, టమాటా కూరలలోనూ ఉపయోగపడతాయి. పండ్లను వాటి సహజమైన, మధురమైన రుచివలన నేరుగానే ఆహారంగా తీసుకుంటారు. ఇవి జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా రోగనివారణ శక్తిని పెంపొందిస్తాయి. తోటకూర, ఉల్లి, అరటి మొదలైన కాండములను కూడా ఆహారంగా తీసుకుంటాము. బచ్చలి, చుక్క, గోంగూర, తోటకూర మొదలైన ఆకులను ఆహారంగా తీసుకుంటాము. వంకాయ,బెండకాయ,కాకర, ఆకాకరకాయ మొదలైన కాయలను కూరలలో ఎక్కువగా వాడుతూ ఉంటాము. వేరు నుండి వచ్చే ఉర్లగడ్డ, చామగడ్డ, కందగడ్డ మొలైన వాటిని ఆహారంగా ఉపయోగిస్తాము.కాలిఫ్లవర్,కుంకుమపువ్వు, అవిసిపువ్వు, మునగపువ్వు, అరటి పువ్వు అరుదుగా వేపపువ్వు పూలరూపంలోనే ఆహారంలో ఉపయోగపడతాయి.