మన దేశ రాష్ట్రపతి ప్రత్యేకంగా తయారు చేయించిన ఓ గుర్రపు బండిని ఉపయోగిస్తారన్న సంగతి తెలిసిందే. పలు ప్రత్యేక సందర్భాల్లో ఈ గుర్రపు బండిని వాడుతుంటారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో అలాగే పలు సందర్భాల్లో పార్లమెంట్కు వచ్చినప్పుడు ఈ గుర్రపు బండిలో వస్తుంటారు. ఈ మధ్యే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పార్లమెంట్కు ఈ బండిలోనే వచ్చారు. అయితే రాష్ట్రపతి ఎందుకలా వెళ్తారు..? కారులో వెళ్లవచ్చు కదా..! ఎందుకు వెళ్లలేదు..? అనే కదా మీరు అడగబోయేది. అయితే అందుకు కారణం ఉంది. అదేమిటంటే…
ప్రస్తుతం ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి వెళ్లింది ఓ గుర్రపు బండిలో అని తెలుసుకున్నాం కదా. అయితే అది ఈనాటిది కాదు, బ్రిటిష్ కాలం నాటిది. ఓ బ్రిటిష్ వైశ్రాయ్ దాన్ని వాడారు. అయితే అప్పట్లో.. అంటే మన దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చాక తెల్లవారు పోతూ పోతూ ఇండియా, పాకిస్థాన్లలో ఎవరికి ఆ గుర్రపు బండి దక్కాలా అన్న సందిగ్ధంలో ఉండి ఇక చివరకు ఆ నిర్ణయాన్ని రెండు దేశాలకు అప్పగించారు. మీలో మీరే తేల్చుకోండి, ఎవరికి ఆ గుర్రపు బండి కావాలో.. అని వారు చెప్పారు. దీంతో ఈ సమస్యను భారత లెఫ్టినెంట్ కల్నల్ ఠాకూర్ గోవింద్ సింగ్, పాకిస్థాన్ ఆర్మీ అధికారి షహబ్జాదా యాకుబ్ఖాన్లు రూపాయి కాయిన్ సాయంతో పరిష్కరించుకున్నారు. అదెలాగంటే…
వారిద్దరూ ఓ రూపాయి కాయిన్ను టాస్ వేసి బొమ్మ, బొరుసు కోరుకున్నారు. దీంతో ఆ టాస్లో భారత్ గెలిచింది. ఈ క్రమంలోనే ఆ గుర్రపు బండి మన వశమైంది. అలా అప్పటి నుంచి ఆ గుర్రపు బండి మన దగ్గరే ఉంది. అయితే 1984 వరకు ఈ బండిని అన్ని వేడుకలకు రాష్ట్రపతి అధికారం వాహనంగా ఉపయోగించేవారు. తర్వాత భద్రతాపరమైన కారణాలతో దీని వాడకాన్ని తగ్గించారు. తిరిగి 20 ఏళ్ల తర్వాత 2014లో ప్రణబ్ ముఖర్జీ ఈ బండిని ఉపయోగంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. అందుకే ఆమె తాజాగా జరిగిన తన ప్రమాణ స్వీకారానికి ఆ గుర్రపు బండిలోనే వచ్చారు. ఇక ఈ బండిలో మొదట ఇద్దరు రాష్ట్రపతులు చెరో వైపున కూర్చుంటారు. కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం తర్వాత వారిద్దరూ గుర్రపు బండిలో తమ తమ స్థానాలను మార్చుకుంటారు. గుర్రపు బండి గురించి చెప్పాలంటే ఇందులో భారత్, ఆస్ట్రియా దేశాలకు చెందిన మిశ్రమజాతి గుర్రాలను ఈ బండి లాగడానికి ఉపయోగిస్తారు. అవీ ఈ గుర్రపు బండి విశేషాలు..! భలే ఆసక్తిగా ఉన్నాయి కదూ..!