ఒక నిజాన్ని గొయ్యి తీసి పాతిపెడితే.. అక్కడే ఇంకో నిజం మొలుస్తుంది.. ఇక్కడ ఒక నిజం పాతిపెట్టబడిందనే ఇంకో వాస్తవం పుట్టుకొస్తుంది.. అదే మలయాళం నరివెట్ట సినిమా. ఇది 2003లో కేరళలో జరిగిన ముతంగ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. వాస్తవ ఘటన ఆధారంగా తీసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ. నరివెట్ట అంటే నక్కల వేట అని అర్థం. అనురాజ్ మనోహర్ దర్శకుడు, టోవినో థామస్ హీరో, సూరజ్ వెంజరమూడి కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే.. నేనొక మనిషిని గనుక. అవును.. మన తోటి వారి, మన పక్కవారి ఆకలి, కన్నీళ్లు, బాధ, వారి మరణం.. మనల్ని కదలించకుండా ఎలా ఉంటాయి? మనల్ని తడమకుండా ఎలా ఉంటాయి? ఏదో ఒక స్థాయిలో అవి మనల్ని.. వెంటాడతాయి. అదే ఈ సినిమా కథ.
కొంతమంది గిరిజనులు.. తమకు ఉండడానికి స్థలం కావాలి, ఇళ్లు కావాలంటూ.. పోరాటం చేస్తారు. ఆ పోరాటాన్ని ఆపడానికి వెళ్లిన పోలీసులు.. ఏం చేశారనేదే.. సినిమాలో కీ పాయింట్. ఆ వ్యవహారంలో ఒక పోలీసు, కొంతమంది గిరిజనులు చనిపోతారు. చనిపోయిన వాళ్లలో చిన్న పిల్లలు, ఆడవాళ్లు కూడా ఉంటారు. కానీ పోలీసులు మాత్రం ఒక్క పోలీసుతో పాటు ఒక్క గిరిజనుడు మాత్రమే చనిపోయినట్టు చూపిస్తారు. కానీ అక్కడ అసలు ఏం జరిగిందనే వాస్తవం కానిస్టేబులైన హీరో వర్గీస్ (టోవినో థామస్)కి తెలుస్తుంది. దాని గురించి పై అధికారులను అడుగుతాడు. అడిగినందుకు తన్నులు తింటాడు. దాడిని ఎదుర్కొంటాడు. కానీ.. తన సమక్షంలో ఆ గిరిజనుల డెడ్ బాడీలను పాతిపెట్టిన విషయాన్ని మరిచిపోలేడు. సాటి మనిషిగా ఆ గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని ఏ మాత్రం సహించలేడు.
అందుకే హీరో వర్గీస్ ఆ నిజాన్ని తన భుజాన వేసుకుని అడుగులు వేస్తాడు… తను ఏం చేయగలడనే ప్రశ్నకు తావు లేకుండా.. ఏదో ఒకటి చేయాలని పూనుకుంటాడు. కోర్టును ఆశ్రయిస్తాడు. పాతి పెట్టిన నిజాలని బయటకు తీస్తాడు. అందరికి తెలిసేలా చేస్తాడు. నిజానికి వర్గీస్ ఒక కానిస్టేబుల్.. తన డ్యూటీ చూసుకుని వచ్చేయొచ్చు.. కానీ అలా చేయడు. గిరిజనం బాధలని తెలుసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు. అల్లాడిపోతాడు. ఎందుకంటే.. తను కానిస్టేబుల్ కంటే ముందు తనొక మనిషి. అందుకే తోటివారి కోసం ఆలోచిస్తాడు. వారిది తనలాంటి ప్రాణమేనని అనుకుంటాడు. వాళ్లతో పాటు ఏడుస్తా డు. వారి కన్నీళ్లను తను పంచుకుంటాడు. ఇదే మానవ నైజం. ఇదే మనిషి లక్షణం. మనందరి నైజం కూడా ఇదే. ర్థపు పొర పెరిగి.. మనం మనవాళ్ల నుంచి, మన తోటివాళ్ల నుంచి, కొన్నిసార్లు మన నుంచి మనం కూడా తప్పిపోతుంటాం.. ఆ సమయంలోనే నరివెట్ట లాంటి సినిమాలు మనల్ని మనకి చూపిస్తాయి. ఇది మనం.. ఇదే మనం అని. అందుకే నేనొక మనిషిని గనుక.. ఈ సినిమా నాకు నచ్చింది. అందరికి కూడా నచ్చుతుంది.
ఈ సినిమా చివరిలో వర్గీస్ .. అనే మాటలు.. ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సినవి… మట్టిలో కలసిపోయిన వారి నినాదాలే.. నా నినాదాలుగా బయటకొచ్చాయి. ఆ చిన్నపిల్ల ఏడుపు శబ్ధమే నన్ను ఇక్కడదాకా తీసుకొచ్చింది. ఒక్కొక్క బొట్టు రక్తానికి చరిత్ర లెక్కలు అడుగుతుంది. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను.. రేపు నా బదులుగా ఇంకొకరు ఇక్కడ ఉంటారు. ఈ అసమానతల సమాజంలో కొందరి బాధలకి, ప్రాణాలకి ఏ పాటి విలువ ఉంటుందో…? లోకం వారిని ఎలా చూస్తుందనే చేదు నిజాలని కూడా ఈ సినిమాలో చూడొచ్చు… ఇందుకే మలయాళం సినిమాలు గొప్పగా ఉంటాయి…