1945 ఆగస్టు 6న ప్రపంచంలో మొట్టమొదటి అణుబాంబు వేస్తే, ఆఖరుది మరో మూడురోజులకు ఆగస్టు 9న పడింది. అప్పటి నుంచి ఈరోజు దాకా ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా తొమ్మిది దేశాలు మొత్తంగా 13 వేల న్యూక్లియర్ ఆయుధాలు సిద్ధంచేసుకున్నాయి. ఇందులో పాకిస్తాన్, ఉత్తర కొరియా లాంటి ఫెయిల్డ్ స్టేట్స్ కూడా ఉన్నాయి. ఇక అణు యుద్ధం తప్పదు అనుకున్న పరిస్థితులు చాలాసార్లు వచ్చాయి. కానీ, ఆ ఒక్కటీ జరగలేదు. మొదటిసారి హిరోషిమా-నాగసాకీ మీద దాడి జరగడానికి, ఆ తర్వాత ఇంతదాకా ఇంత లావు సంయమనం పాటించడానికి కారణం ఒకటి ఉంది. అదేమీ సాటి మానవుల బాధల మీద రాజకీయ నాయకులకు, సైనికాధికారులకు ఉన్న సానుభూతి కాదు. మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ (తప్పనిసరి పరస్పర సర్వనాశనం?).
అంటే ఏమీ లేదు, తన దగ్గర తప్ప ఎవ్వరి దగ్గరా, ముఖ్యంగా జపాన్ వాళ్ళ దగ్గర, అణ్వాయుధాలు లేవు కదా అన్న ధైర్యంతో అమెరికా వేసింది. ఆ ధైర్యాన్ని 1949లో అణు పరీక్షలు జరిపి సోవియట్ యూనియన్ తుత్తునియలు చేసింది. అప్పటి నుంచి ఏ దేశమైనా అణుదాడి చేస్తే, తమ మీద కూడా జరుగుతుందన్న భయంతో, కేవలం భయంతో మాత్రమే, అణుదాడి చేయట్లేదు. ఈరోజు ఆ అటామిక్ బాంబులు కాస్తా న్యూక్లియర్ బాంబులయ్యాయి. ఆకాశం నుంచి విమానంలోంచి అమెరికన్ పైలట్ జారవిడిచిన రోజుల నుంచి ఖండాంతర మిస్సైళ్ళు ప్రయోగించి వాటి గమనాన్ని నియంత్రించగల సాంకేతికత అభివృద్ధి చేసుకున్న స్థాయికి చేరుకుంది ప్రపంచం. ఉత్తర అమెరికా, తూర్పు ఐరోపా, పశ్చిమ ఐరోపా, దక్షిణాసియా, తూర్పు ఆసియా – ఇన్ని ప్రాంతాల్లో అత్యంత అభివృద్ధి చెందిన అమెరికా మొదలుకొని ఉగ్రవాదంతో కునారిల్లే పాకిస్తాన్ వరకూ రకరకాల దేశాల చేతుల్లో అణ్వాయుధాలు, వాటిని ప్రయోగించల అత్యాధునిక క్షిపణి ప్రయోగ వ్యవస్థలు ఉన్నాయి. అంతేకాక – అణ్వాయుధ శక్తి కలిగిన దేశాలపై రక్షణకు ఆధారపడిన దేశాల జాబితా తీస్తే అణ్వాయుధం ప్రయోగిస్తే తిరిగి ప్రయోగించిన దేశం మీద కూడా పడే ప్రమాదం లేని చోటు భూస్థలమంతా వెతికినా దొరకదేమో!!!
అందువల్ల మాత్రమే న్యూక్లియర్ బాంబులు వెయ్యట్లేదు. ఇప్పుడు మీరు అడిగిన ఇజ్రాయెల్ ఉదాహరణ తీసుకుందాం. గాజా అన్నదేమీ అమెరికాకి జపాన్ ఉన్నంత దూరంలో లేదు కాబట్టీ సైనికంగా చూసినా కన్వెన్షనల్ న్యూక్లియర్ అటాక్ చెయ్యలేదు. చేస్తే ఇప్పటికే అన్నివిధాలా నష్టపోయిన ఇజ్రాయెల్ దక్షిణాదికి ఇది దెబ్బమీద దెబ్బ అవుతుంది. కానీ, టాక్టికల్ న్యూక్లియర్ దాడులు చేయడానికేమీ సైనికంగా అడ్డు లేదనే అనుకుంటున్నాను. గాజా మీద న్యూక్లియర్ బాంబు దాడులు వేసి భీకరంగా ప్రతీకారం తీర్చుకోవాలని ఇజ్రాయెల్ నాయకత్వం నిర్ణయించుకున్నారని అనుకుందాం. ఎంతమంది చనిపోతారు, అందులో ఎంతమంది ఉగ్రవాదులు, ఎంతమంది సాధారణ పౌరులు ఉంటారు వంటివాటి కన్నా, ఇజ్రాయెల్కు తర్వాతి పరిణామాలు ఎలా ఉండొచ్చు అన్నదే ప్రాధాన్యత అవుతుంది. ఈనాటి పరిస్థితుల్లో గాజాపై అణు ఆయుధాల వాడకం అన్నది జరిగి భారీ ఎత్తున జననష్టం జరిగితే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎవరి చేతుల్లోనూ ఉండవు. తిరిగి తిరిగి ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అనవసరమైన యుద్ధంలోకి దారి తీయొచ్చు, అణు యుద్ధానికే ఇది టిపింగ్ పాయింట్ కావచ్చు.
ఆఫ్టరాల్ – ఆస్ట్రో-హంగేరియన్ రాజకుమారుడిని, అతని భార్యని బోస్నియాలో ఆరుగురు హంతకులు రెండు తుపాకులతో కాల్చి చంపితే పేకమేడ కూలినట్టు పరిణామాలు చకచకా మారిపోయి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఇక్కడొక రాజకుమారుడు, అతని భార్య హత్యకు గురవడం మాత్రమే ప్రపంచ యుద్ధానికి మూలకారణం కాదు. అదొక టిపింగ్ పాయింట్. అప్పటికే రాజకీయ పక్షాల మధ్య టెన్షన్లు, జాతుల మధ్య, దేశాల మధ్య ఉన్న శత్రుత్వాలు, తేల్చుకోని లెక్కలూ, వీటన్నిటికీ మించి సామ్రాజ్యాల భూదాహమూ ఉండగా ఈ హత్య అన్నది యూరోపియన్ రాజకీయాల నెవరకంట తగిలిన దెబ్బలాగా మొత్తం గమనాన్ని మార్చేసింది. గాజా మీద అంత తీవ్రమైన, అమానుషమైన ఆయుధంతో దాడిచేసి సాధారణ గాజన్ల జీవితాలను ఒక్క దెబ్బలో బూడిదపాలు చేయడమే జరిగితే ఇప్పటిదాకా ఇజ్రాయెల్ పక్షాన చాలావైపుల నుంచి ఉన్న మొగ్గు మొత్తం గంగలో కలిసి ఒక్కసారిగా ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలకు శత్రువూ అవ్వొచ్చు, పైన చెప్పినట్టు అదే మన ప్రపంచంలో అరబ్బులకీ-పర్షియన్లకీ, వాళ్ళకీ-అమెరికన్లకీ, అమెరికన్లకీ-ఇజ్రాయెలీలకీ, వీళ్లిద్దరికీ-చైనీయులకీ, రష్యన్లకీ-పాశ్చాత్యులకీ – ఇలా రకరకాల దేశాల మధ్య ఉన్న సమీకరణాలన్నీ ఒక్క దెబ్బతో పునాదులు కదిలిపోవచ్చు, ఇప్పటిదాకా ఉన్న సమస్యలన్నీ పెనుభూతాలైపోవచ్చు – క్లుప్తంగా – అదే టిపింగ్ పాయింట్ అయిపోవచ్చు.
అందువల్ల – ఏ కాస్తయినా అట్టడుగునైనా భయమూ, భక్తి ఉన్న రాజకీయ నాయకుడైనా, సైనిక నాయకుడైనా – గత 78 సంవత్సరాలుగా మళ్ళీ రెడ్ బటన్ నొక్కలేదు. అయితే – అసలు భయమేమిటంటే ఒక్క పిచ్చాళ్ళ గుంపుకు, ఒక్క పిచ్చి క్షణంలో ఆ బటన్ అందుబాటులో ఉంటే… నొక్కితే… బూమ్!!!