mythology

మ‌హాభార‌తంలోని ఈ పాత్ర‌ల గురించి మ‌న‌కు తెలిసే నీతి, అర్థం అయ్యే విష‌యాలు ఏమిటంటే..?

మహాభారతం… హిందువులకు అద్భుతమైన ఇతిహాసం. ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉందని, మహాభారతంలో లేనిదేది ప్రపంచంలో లేదని అంటారు. ధర్మం, న్యాయం, మోసం, స్నేహం, వెన్నుపోటు… ఇలా ఎన్ని రకాల లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలకు తగ్గ మనుషులు మహాభారతంలో కనిపిస్తూనే ఉంటారు. ఒక జీవితం నేర్పే పాఠాన్ని మహాభారత గ్రంథం నేర్పిస్తుందని చెబుతారు. ఎవరైతే మహాభారతాన్ని ఔపోసన పడతారో, అందులోని ప్రతి పాత్రని అర్థం చేసుకుంటారో… వారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకునే శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటలను పొందుతారని పండితులు చెబుతారు. జీవితంలో చెడు స్నేహం అంతానికి దారితీస్తుందని శకుని వల్ల అర్థమవుతుంది. శకుని కౌరవులతో స్నేహం చేసి వారి నాశనానికి కారణం అయ్యాడు. శకునితో స్నేహం చేయకపోతే కౌరవులు అంత దారుణమైన స్థితిలో మరణించే వారు కాదేమో. శకునిలాంటి స్నేహితుడు ఉండడం చాలా ప్రమాదకరం.

అతి మంచితనం, జాలి, దయ‌ వంటివి మీ జీవితాన్నే కాల్చేస్తాయని చెప్పడానికి కర్ణుడే ఉదాహరణ. కర్ణుడు తన అతి మంచితనంతో, దానధర్మాలతో, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. చివరికి చెడు వైపు నిలబడి ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. జీవితంలో మీరు గెలిచి నిలవాలంటే మంచివారితోనే స్నేహం చేయాలి. అనవసరమైన వ్యక్తులకు, అనవసరమైన పరిస్థితుల్లో దానధర్మాలు చేయడం మంచి పద్ధతి కాదు. పిల్లలను క్రమశిక్షణలో పెంచకపోవడం అనేది తల్లిదండ్రుల తప్పేనని మహాభారతం చెబుతోంది. గాంధారి 100 మంది పిల్లలకు తల్లయింది. కానీ 100 మందిలో ఒక్కరిని కూడా సవ్యమైన మార్గంలో నడిపించలేకపోయింది. రాజ్యాన్ని బిడ్డలకు సమంగా పంచే విషయంలోనూ గొడవలు జరిగాయి. వారి క్రమశిక్షణ దారి తప్పింది. పిల్లలను కాచుకొని కూర్చోలేక గాంధారి వారిని పట్టించుకోవడమే మానేసింది. చివరికి దుర్యోధనుడు బాటలో కౌరవులంతా నడిచి చెడు వ్యక్తులుగా మారారు. శకునిలాంటి చెడు స్నేహితులతో కలిసి నాశనమయ్యారు.

mahabharata characters and lessons we should learn from them

బిడ్డల మీద ప్రేమ ఉండడం మంచిదే, కానీ అతి ప్రేమ వారి నాశనానికే దారితీస్తుంది. ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడు మహాభారతంలో నిరూపించాడు. అతడికి ఉన్న అతి ప్రేమ బిడ్డలను చెడ్డవారిగా మార్చింది. కొడుకుల వినాశనానికి ధృతరాష్ట్రుడు పరోక్షంగా కారణమయ్యాడు. చిన్నప్పటి నుంచే వారిని ఒక క్రమశిక్షణలో పెట్టి ఉంటే వారు పెద్దయ్యేసరికి ఎన్నో కొన్ని విలువలను నేర్చుకుని ఉండేవారు. కానీ దృతరాష్ట్రుడి అతి ప్రేమ, అతి నమ్మకం కౌరవుల నాశనానికి కారణమైంది. జీవితంలో ఎప్పుడూ నిత్య విద్యార్థిగానే ఉండాలని అర్జునుడు చెప్పాడు. అర్జునుడు తన జీవితాంతం ఏదో ఒక విద్యను నేర్చుకుంటూనే ఉన్నాడు. విద్యను నేర్చుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు. ఎవరి దగ్గర ఎలాంటి అస్త్రాలు ఉన్నాయో తెలుసుకొని, వారి దగ్గరే శిష్యరికం చేసి ఆ ఆయుధాలను పొందాడు. చివరికి మహాభారతంలో గొప్ప యోధుడిగా పేరు తెచ్చుకున్నాడు.

ఏ విషయం గురించి అయినా పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యమని అభిమన్యుడు నిరూపించాడు. పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే అభిమన్యుడికి తెలుసు, కానీ ఆ పద్మ వ్యూహంలోంచి బయటికి రావడం తెలియక వీరమరణం పొందాడు. అర్ధ జ్ఞానంతో అతి నమ్మకంతో పద్మవ్యూహంలోకి వెళ్లడం, అభిమన్యుడు చేసిన తప్పు. అర్ధ జ్ఞానంతో ఏ పనీ చేయడం మంచి పద్ధతి కాదు. మహిళలను ఎంతో గౌరవించాలని, వారి కోపం, అవమానం, శాపం రాజ్యాలనే నాశనం చేస్తాయని మహాభారతంలోని ద్రౌపది పాత్ర చెబుతోంది. ఆమెకు జరిగిన అవమానం, కౌరవ సామ్రాజ్యం మట్టిపాలయ్యేలా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం. వారిని అవమానించే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. స్త్రీలను ఇతరుల ముందు అవమానించడం, వారి చేత కన్నీరు పెట్టించడం ఎదుటివారికే ప్రమాదకరం. ఇలా చెప్పుకుంటూ పోతే మహాభారతంలో ఒక్కో పాత్ర ఒక్కో జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. మహాభారతాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి జీవితంలో కచ్చితంగా విజయుడై తీరుతాడు.

Admin

Recent Posts