ధృతరాష్ట్రుని సోదరుడు, కురు సామ్రాజ్య ప్రధానమంత్రి విదురుడు. సునిశిత ఆలోచన ధోరణి దార్శనీయత కలిగినటువంటి గొప్ప మేధావి. సరళమైన ప్రశాంతమైన చిత్తం కలిగినటువంటి స్థితి ప్రజ్ఞ కలిగిన రాజకీయ వేత్త. కృష్ణ భగవానుడికి కూడా అత్యంత ప్రీతిపాత్రుడైన విదురుడి ని సంప్రదించకుండా కురు మహారాజు దృతరాష్ట్రుడు ఎలాంటి నిర్ణయాలు చేసేవాడు కాదు. అలా వారిద్దరి మధ్య సాగిన సంభాషణలే విదురనీతిగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆయన జీవితానికి సంబంధించిన అనేక సత్యాలను ప్రపంచానికి మార్గదర్శకం చేశాడు. దానధర్మం కర్మ అనేక ఫలితాల గురించి వివరించాడు.. విదుర నీతి ప్రకారం మనిషి విడిచిపెట్టవలసిన చెడు లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
తక్కువగా మాట్లాడడం ఎప్పుడూ శ్రేయస్కరం. ఎక్కువ మాట్లాడడం వల్ల తెలిసో తెలియకో తప్పులు మాట్లాడే ప్రమాదముంటుంది. అందుకే అవసరానికి మించి మాట్లాడక పోవడమే చాలా మంచిది. ఈ లక్షణం వివాద రహితులుగా చేస్తుంది. అందువల్ల అతిగా మాట్లాడటం అనర్థదాయకం అని విదురనీతి ద్వారా తెలియజేశాడు. ఎలాంటి స్థితిలో ఉన్నా గర్వం పనికిరాదు. అలాంటి వ్యక్తులు సాధారణంగా ఎవరికీ నచ్చరు. అందుకే అహంకారానికి దూరంగా ఉండాలని విదుర నీతి ద్వారా తెలియజేశారు.
నమ్మిన వారిని మోసం చెయ్యడం మంచిది కాదు. నమ్మక ద్రోహం మొదటికే మోసం అని విదుర నీతి వివరిస్తుంది. ఆశ అందలాన్ని అందుకునే బలాన్ని కల్పిస్తే అత్యాశ అధఃపాతాళానికి తోసేస్తుంది. దురాశ దుఃఖానికి చేటని విదుర నీతి చెబుతోంది.ఎక్కువ ఆశ పడే వ్యక్తి ఎప్పుడూ హ్యాపీ గా ఉండలేడు. దురాశ మిమ్మల్ని నాశనం చేస్తుంది. అతిగా కోపం తెచ్చుకోవడం అంత మంచిది కాదు. కోపంలో మాట్లాడే మాటలకు, నిర్ణయాలకు ఇతరులకే కాదు వారికి కూడా నష్టం జరగవచ్చు.