మహాత్మ గాంధీ పచ్చి కూరగాయలు తినేవారని చిన్నప్పుడు చదివే ఉంటాం. కొంత మంది గిరిజనులు ఇప్పటికీ పచ్చివే తింటూ కాలం గడుపుతారని చదివే ఉంటాం. ఇలా పచ్చి కూరగాయలు తినడం వల్ల మేలు జరుగుతుందనీ కొందరు ప్రకృతి వైద్యులు, ఆయుర్వేద వైద్యులు చెబుతారు. కానీ ఇది ఎంతవరకు నిజమో చాలా మందిలో ఒక సందేహం ఉండే ఉంటుంది.
కూరగాయల్ని ఉడికించకుండా పచ్చిగానే తింటే ఆరోగ్యానికి మంచిదనే వాదన చాలా మందిలో ఉంది. ముఖ్యంగా యోగా, ప్రకృతి వైద్య నిపుణులు పచ్చి ఆహార పదార్థాలు మంచివి అని చెబుతారు. బరువు తగ్గించుకోవడానికి, బీపీ అదుపులో ఉంచుకోవడానికి, షుగర్ వ్యాధిని నియంత్రణలో పెట్టడానికి పరగడుపున పచ్చి కూరగాయలు తినటం అలవాటు చేసుకుంటే మంచిదని చెబుతారు. అసలీ వాదనలో నిజమెంత? కూరగాయల్ని ఉడికించకుండా పచ్చిగానే తినటం మన ఆరోగ్యానికి మంచిదేనా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.
కూరగాయల్ని మన రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని రెండు రకాలుగా తినవచ్చు. ఒకటి ఉడికించి వండి తినటం, రెండు పచ్చివి తీసుకోవడం. కానీ ఈ మధ్య కాలంలో కూరగాయలు పండించడంలో రసాయన ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. అందుకే వాటిని నేరుగా తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు.
ఏ కూరగాయనైనా పచ్చివి తినాలంటే ముందుగా వాటిని ఉప్పు నీళ్లల్లో 20 నుంచి 30 నిమిషాల వరకు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఎరువుల వల్ల కలిగే నష్టాల నుంచి బయట పడొచ్చు. పండ్లు, కూరగాయలు కానీ ఉప్పు నీళ్లలో నానబెట్టి వల్ల వాటిపై ఉండే రసాయనాలు తొలగిపోతాయి. ఆ తర్వాత వాటిని సాధారణ నీటితో కడిగి తినాలి. ఈ పచ్చి కూరగాయల్ని తీసుకుంటే వీటిల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి. కూరగాయల్ని వేడి చేస్తే పీచు పదార్థం, విటమిన్లు, మినరల్స్ను పోతాయి. అందుకే పచ్చి వాటిని తీసుకోవడం వల్ల వీటిని నష్టపోయే అవకాశాన్ని కొంత మేర తగ్గించుకోవచ్చు. రోజు మొత్తంలో 200 నుంచి 400 గ్రాముల వరకు పచ్చి కూరగాయల్ని తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.