ఈశ్వరుడి పూజలో సింధూరం, పసుపు, తులసి దళాలు ఎందుకు వినియోగించ‌రో తెలుసా ?

సకలకోటి దేవతలలో పరమేశ్వరుడికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. కోరిన కోరికలను తీర్చే భోళాశంకరుడిగా ఆయనను కీర్తిస్తారు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున శివ‌రాత్రిని జరుపుకుంటారు. అభిషేక ప్రియుడు అయినటువంటి పరమేశ్వరుడికి నీటితో అభిషేకం చేసి పూజించిన ఆయన కరుణాకటాక్షాలు మనపై ఉంటాయని భావిస్తారు. అయితే స్వామివారికి శివ‌రాత్రి మాత్ర‌మే కాకుండా ఎప్పుడైనా అభిషేకం చేయ‌వ‌చ్చు. వివిధ రకాల పుష్పాలతో కూడా పూజలు చేస్తుంటారు. అయితే శివునికి ఎప్పుడూ కూడా సింధూరం, పసుపు, తులసీదళాలను సమర్పించరని మీకు తెలుసా? శివలింగంపై శంఖం నుండి నీటిని సమర్పించకూడదని తెలుసా? వీటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శివుని ఆరాధన సమయంలో శివలింగంపై బిల్వ ప‌త్రం సమర్పిస్తారు. కానీ సింధూరం ఎప్పుడూ సమర్పించరు. వాస్తవానికి హిందూ మతంలో స్త్రీలు తమ భర్తల ఆయుష్షు పెరగాలని నుదుటన సింధూరం ధరిస్తారు. ఇదే సమయంలో శివుడిని ల‌య‌కారుడు అని పిలుస్తారు. కాబట్టి శివలింగంపై సింధూరం పెట్ట‌రు. ఆధ్యాత్మిక, ధార్మిక విశ్వాసాల ప్రకారం అలా ఇవ్వడం అశుభంగా పరిగణిస్తారు. కాబట్టి పరమేశ్వరుడికి సింధూరం అర్పించరు. సనాతన ధర్మం ప్రకారం పసుపును చాలా స్వచ్ఛమైన, పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే శివుడికి మాత్రం పసుపును వినియోగించరు. శాస్త్రాల ప్రకారం శివలింగం పురుష తత్వానికి చిహ్నం. పసుపు మహిళలకు సంబంధించింది. శంకరుడికి పసుపు ఇవ్వకపోవడానికి ఇదే కారణం. శివారాధనలో మీరు పసుపును ఉపయోగిస్తే అది నిరూపయోగంగా మారుతుంది.

why these items are never used in lord shiva pooja

ఆ పూజ ఫలాలను పొందలేరు. ఇక తులసీదళాలకు చాలా పవిత్రత ఉంది. ప్రతి పూజలోనూ వీటిని ఉపయోగిస్తారు. అయితే శివుని పూజలో వీటిని ఉపయోగించకూడదు. ఎందుకంటే తులసి గత జన్మలో రాక్షస వంశంలో పుట్టింది. ఆమె పేరు వృందా.. ఆమె మహా విష్ణువుకు పరమ భక్తురాలు. ఆమె భర్త రాక్షస రాజు జలంధరుడు. అతడిని శివుడు ఒక యుద్ధంలో వధించాడు. దీంతో శివుని పూజలో తులసీదళాన్ని ఉపయోగించకూడదని ఆమె శపించింది. అలాగే శివలింగానికి శంఖంతో నీటిని సమర్పించకూడదు. శివపురాణం ప్రకారం శంఖ‌చూడుడు అనే రాక్షసుడిని శివుడే వధించాడు. అందుకే శంఖంతో శివుడికి నీటిని సమర్పించరు. ఇలా వివిధ కారణాలవల్ల ఇవన్నీ శివుని ఆరాధనకు నిషిద్ధం అయ్యాయి.