చాలా చోట్ల లింగరూపంలోనే కనిపించే శివుడు ప్రముఖ క్షేత్రాల్లోనే విగ్రహరూపంలో దర్శనమిస్తాడు..కానీ నిద్రించే భంగిమంలో ,తలకిందులుగా ఉన్న భంగిమలో శివుడు మన తెలుగు రాష్ట్రల్లో దర్శనమిస్తున్నాడు..అదెక్కడో.. ఆ విశేషాలేంటో చూడండి… ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా నాగులాపురం మండలం సరటుపల్లిలో మనకు పడుకుని ఉన్నమహాశివుడు కనిపిస్తాడు.క్షీరసాగరమథనం అప్పుడు లోకకళ్యాణం కోసం హలాహలాన్ని మింగిన శివుడు,విషప్రభావం వల్ల కాసేపు స్పృహ తప్పిపడి పోయిన శివుడు అమ్మవారి ఒడిలో సేదతీరుతుంటే కంగారు పడిన దేవతలు శయనరూపంలో ఉన్న శివున్ని సేవించుకున్నారని,అప్పుడు తన కంఠంలో ఉన్న గరళాన్ని అందరికీ చూపించి అభయమిచ్చాడనే స్థల పురాణం.ఈ ప్రాంతానికి సురులు వచ్చి శివున్ని పూజించినందున సురులపల్లిగా,కాలక్రమేణా సురుల పల్లి సరటుపల్లిగా మారిందని చెబుతారు. శివరాత్రి రోజున ఈ శివున్ని దర్శిస్తే ఆరోగ్య సమస్యలు పోతాయని భక్తుల విశ్వాసం.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం యనమదుర్రులో శివుడు తలకిందులుగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు..ఈ గుడికి వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది.శీర్షాసనంలో తపస్సు చేస్తున్న శివుడి జటాజుటం నేలకు తగులుతూ,ముఖం ,పాదాలు ,ఉదరం ,మోకాళ్లు పైకి ఉండి పక్కనే అమ్మవారు కొలువై ఉంటుంది.జగన్మాత పార్వతిదేవి నెలలపిల్లాడయిన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్నట్లు ఉండడం ప్రత్యేకత.
ఈ గుడి వెనుక ఒక పురాణకథ ఉంది…లోకాన్ని పట్టి పీడిస్తున్న శంభరున్ని అంతం చేయాలనుకున్న యమధర్మరాజు , శంభరుడు శివుని భక్తుడని శంభరున్ని అంతంచేయాలంటే శివుడి ఆజ్ఞ తీసుకోవాలని శివుడి గురించి తపస్సు చేస్తాడు.అదేసమయంలో కైలాసంలో తలకిందులుగా తపస్సు చేస్తున్నశివుడు,పక్కనే బాలింత పార్వతీ దేవి యమధర్మరాజు తపస్సు చేస్తున్నచోట ప్రత్యక్షం అయ్యారని పురాణకథ.యమధర్మరాజే స్వయంగా ఇక్కడ శివున్ని ప్రతిష్టించి గుడి కట్టి,గుడికెదురుగా ఒక కోనేరుని ఏర్పాటు చేసాడని,ఈ కోనేరులో స్నానం చేసి ఆ శివున్ని దర్శించుకుంటే అకాల ప్రాణభయం ఉండదని భక్తుల విశ్వాసం.