తెలుగు చిత్రపరిశ్రమలో వైవిధ్యభరితమైన సినిమాల ద్వారా గుర్తింపు పొందిన నటుడు తొట్టెంపూడి వేణు. ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చినప్పటికి సినిమాల మీద ప్రేమతో కూడిన ఆసక్తి తోడై సినీ ఇండస్ట్రీ వైపు అడుగులేశారు. కథా బలం ఉన్న సినిమాలను ప్రేక్షకులు తిరస్కరించరనే నమ్మకాన్ని వేణు తన చిత్రాల ద్వారా ఆ నమ్మకాన్ని కల్గించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా సైతం కొత్త దర్శకులను, సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వేణు అలియాస్ తొట్టెపూడి వేణుగోపాల్ రావు 1976, జూన్ 4న గుడివాడలో జన్మించారు. స్వస్థలం మాత్రం ప్రకాశం జిల్లా కొండెపి మండలం పెరిదేపి గ్రామం. తండ్రి సుబ్బారావు ఆరోజుల్లోనే లండన్ వెళ్లి ఆంగ్లంలో పి.హెచ్.డి పూర్తి చేశారు. ఆ తర్వాత ఇండియా తిరిగి వచ్చి ప్రొఫెసర్గా పలు ప్రదేశాల్లో పనిచేశారు. అలాగే, మదురై వివేకానంద కాలేజీకి ప్రిన్సిపాల్గానూ పనిచేశారు. వేణు బాల్యం, విద్యాభ్యాసం ఒంగోలు, విజయవాడ, చెన్నై, మదురైలలో సాగింది. ఇంజనీరింగ్ చదవడానికి కర్ణాటకలోని ధార్వాడ్ పట్టణంలో ఉన్న ప్రముఖ SDMCET కాలేజీలో బీఈ (సివిల్ ఇంజనీరింగ్) పూర్తిచేశారు.
వేణు మేనమామ మాగంటి అంకినీడు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఎంపీగా, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. పెదనాన్న కావూరి సాంబశివరావు సైతం ఐదు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. తన సొంత బావగారైన నామా నాగేశ్వరరావు సైతం ప్రముఖ పారిశ్రామికవేత్త, ఖమ్మం నుంచి రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. తన కుటుంబం మొత్తం రాజకీయాలు, వ్యాపారాల్లో ఉన్నప్పటికి ఇంజనీరింగ్ చదివే రోజుల్లో సినిమాల పట్ల ఆసక్తి ఏర్పడి, సినిమాల్లోకి వెళ్ళాలని దాదాపుగా డిసైడ్ కూడా అయిపోయారు వేణు. అయితే, బావ నాగేశ్వరరావు కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉండటంతో ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఆ కంపెనీలో పనిచేశారు. కంపెనీలో పనిచేస్తున్నా సినిమాల మీదే దృష్టి ఉండటంతో, కొద్ది నెలల్లోనే సినిమా అవకాశాలు వెతుక్కుంటూ చెన్నై వెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా అందరూ కొత్త వారితో తీస్తున్న చిత్రానికి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి ప్రయత్నిస్తే సినిమాలో హీరో రోలకు సెలక్ట్ అయ్యారు.
అయితే, ఏమైందో ఏమో కానీ అది పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. సినిమా ఆగిపోయినా, నిరుత్సాహపడకుండా హైదరాబాదుకు మకాం మార్చి ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే పలువురు యువ నటులు, రైటర్స్, దర్శకులు పరిచయం అయ్యారు. అలా పరిచయం అయిన జాబితాలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, డైరెక్టర్ విజయభాస్కర్ కూడా ఉన్నారు. విజయభాస్కర్, త్రివ్రిక్రమ్ లు కలిసి సినిమా రూపొందించాలనే ఆలోచనలో ఉన్న సమయంలో వారి కథను వేణు విని బాగా నచ్చడంతో సినిమా నిర్మించడాకి ముందుకువచ్చారు. వేరే హీరో ఎందుకని వేణునే హీరోగా చేయమని అడగటంతో అందుకు ఒప్పుకున్నారు. ఆలా వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన చిత్రమే స్వయంవరం. తన మిత్రుడైన శ్యామ్ ప్రసాద్తో కలిసి ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థను ఏర్పాటు చేసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది.1999లో విడుదలైన ఈ చిత్రం భారీ హిట్ చిత్రంగా నిలిచి హీరోగా వేణుకు, రైటర్గా త్రివ్రికమ్ శ్రీనివాస్కు, దర్శకుడు భాస్కర్కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం విజయంతో వేణుకు వరుస ఆఫర్స్ వచ్చాయి.
2000లో వచ్చిన మనసు పడ్డాను కానీ చిత్రం ఫ్లాప్ అయినా, చిరునవ్వుతో చిత్రంతో మళ్ళీ మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంతోనే త్రివిక్రమ్ కలం బలాన్ని ఇండస్ట్రీ గుర్తించింది. 2001 నుంచి 2004 మధ్యలో నటించిన అధిక చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అదే సమయంలో వచ్చిన హనుమాన్ జంక్షన్(2001), పెళ్ళాం ఊరెళ్తే (2003), ఖుషి ఖుషిగా (2004) వంటి మల్టీస్టారర్ చిత్రాలతో విజయాన్ని అందుకున్నారు. 2006లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం శ్రీకృష్ణ 2006 బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది. 2007లో వచ్చిన యమగోల మళ్ళి మొదలైంది చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. 2009లో సీనియర్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో సోలో హీరోగా నటించిన గోపి, గోపిక, గోదావరి చిత్రం ఆ ఏడాది వచ్చిన అన్ని చిత్రాల్లోకెల్లా అతిపెద్ద ఫ్యామిలీ హిట్ చిత్రంగా నిలిచింది. దాదాపు 2001 తర్వాత వేణు సోలో హీరోగా నటించిన హిట్ చిత్రంగా నిలిచింది. 2009-11 మధ్యలో వేణు నటించిన చిత్రాలు ఫ్లాప్ కావడంతో పాటుగా వ్యక్తిగత కారణాల వల్ల సినిమాల నుంచి విరామం తీసుకున్నారు.
ఆ దశలో వేణు చివరిగా నటించిన చిత్రం రామాచారి. సినిమాల నుంచి విరామం తీసుకున్న తర్వాత తమ బావ వ్యాపారాలను టేకప్ చేసి ఆ పనుల్లోనే దాదాపు 9 ఏళ్ళ పాటు బిజీగా గడుపుతూ వచ్చారు. అయితే, 2022లో మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ద్వారా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆ 2023లో అతిథి అనే వెబ్ సిరీస్లో నటించారు, వేణు హీరోగా నటించిన ఎక్కువ చిత్రాల్లో ఫ్లాప్స్ ఉన్నా, అవి తర్వాత కాలంలో బుల్లితెరపై ప్రదర్శించినప్పుడు మంచి టీఆర్పీ రేటింగ్స్ వచ్చేవి. అందువల్లే వేణు మెజారిటీ చిత్రాలన్ని అప్పటి జెమిని యాజమాన్యం ఎక్కువగా తీసుకునేది. తన చిత్రాల ద్వారా ఎందరో యువ డైరెక్టర్స్, ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈరోజు వారిలో ఎక్కువ మంది ఇండస్ట్రీలో మంచి పొజిషన్స్లో ఉన్నారు. నటుడిగానే కాకుండా తమ బ్యానర్లో హిట్, ఫ్లాప్స్ గురించి పట్టించుకోకుండా మనసుకు నచ్చిన కథలతో సినిమాలు తీస్తూ పోయారు. వేణు బ్యానర్ ప్రొడ్యూస్ చేసిన చిత్రాలన్ని చాలా తక్కువ బడ్జెటుతోనే నిర్మించబడేవి. అందువల్ల మూవీ ఫ్లాప్ అయినా పెట్టుబడి తిరిగివచ్చేది.
వేణు వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన జీవిత భాగస్వామి పేరు అనుపమ. వారికి ఒక పాప, బాబు. ఎంబీఏ గోల్డ్ మెడలిస్టు అయిన ఆమె కుటుంబ బాధ్యతల కోసం గృహిణిగా మారారు. గృహిణిగా ఉన్నప్పటికి ఎస్పీ బ్యానర్స్ లో నిర్మించిన చిత్రాలకు కాస్ట్యూమ్స్ పర్యవేక్షణ చేసేవారు. ప్రస్తుతం తన సొంతంగా హైదరాబులో బోటిక్ నడిపిస్తున్నారు. ఇంక అవార్డుల విషయానికి వస్తే, దాదాపు 25 పైగా చిత్రాల్లో నటించిన వేణు స్వయంవరం చిత్రంలో తన అద్భుతమైన నటనకు స్పెషల్ జ్యురీ నంది అవార్డును అందుకున్నారు. అలాగే, స్వయంవరం 2001లో వచ్చిన చిరునవ్వుతో చిత్రానికి గానూ తమ బ్యానర్ తరపున ఉత్తమ చిత్రం క్యాటగిరిలో నంది అవార్డును అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యేలా నటించిన హీరోగా వేణుకు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం బిజినెస్ మీద ఎక్కువ సమయం గడపాల్సి వస్తుండడంతో, సినిమాల మీద అంతగా ఫోకస్ చేయడం లేదు కానీ, ఇప్పటికి తన వద్దకు వచ్చే దర్శకుల కథలు నచ్చితే నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు.