ఇప్పుడున్న కొండచిలువలు మనుషుల్ని మింగగలవా?

ఒక్క అనకొండలు మాత్రం మనిషిని మ్రింగగలవ్ అనుకుంటే అది హాలీవుడ్ సినిమా అనకొండ ప్రభావమే! అలానే గ్రేట్ ఆఫ్రికన్ రాక్ పైథాన్ ఖచ్చితంగా మ్రింగగలదు అని అనుకుంటే డిస్కవరీ బాగా చూస్తున్నారని అర్థం. ఐతే ఇవి పిల్లలను మ్రింగగలవు. ఇండియన్ పైథాన్ కూడా అంతే! ఐతే రిటైక్యులేటెడ్ పైథాన్ మాత్రం మిగతా అన్నింటిలోకీ పెద్ద కొండచిలువ జాతి. ప్రపచంలోనే అతి పెద్ద పాము. ఏ కొండచిలువైనా ఇదారేళ్ళ పిల్లల్ని తేలిగ్గా మ్రింగేయగలదు. ఇవి సాధారణంగా గొఱ్ఱెలను, మేకలను, దుప్పిలను పట్టుకుంటాయ్ కనుక అదే పరిమాణంలో మనిషి కనపడ్డా దాడి చేస్తాయి. పూర్తిగా ఎదిగిన మనిషినైతే మ్రింగడం వాటికి చాలా ఇబ్బందే!

కానీ ఇప్పటి దాకా అసలు కొండచిలువలు మనిషిని చంపిన దాఖలాలు ఒకటీ అరా ఉన్నా ఓ సగటు మనిషిని మ్రింగింది మాత్రం ఇటీవలే!! ఇండోనేషియాలో రిటైక్యులేటెడ్ పైథాన్ ఓ పాతికేళ్ళ రైతుని రెండు నిమిషాల్లో చంపినా మ్రింగేందుకు ఎన్నో గంటలు పట్టింది. ఆ తర్వాత దాని పొట్ట కోసి అతడి శవాన్ని బయటకు తీశారు. ఇప్పటిదాకా ఇదే మొదటి ఘటన. ఐతే ఇవి ఊరికే మన జోలికి రావ్. కానీ, వాటికి ఉండే పళ్ళు మాత్రం రేగు ముల్లు లాగా కొస లోపలికి తిరిగి ఉండి, అది పట్టుకున్నాక మనం వెనక్కు తీసుకునే ప్రయత్నంలో ఇంకా ఎక్కువ గాయం చేసేట్టుగా ఉంటాయ్.

are the pythons able to swallow humans

సాధారణంగా తను మ్రింగలేని వాటిపై అవి దాడి చెయ్యవ్, భయపడితే తప్ప. అవి ఒకసారి భోజనం చేస్తే కొన్ని నెలల వరకూ తిండి తినవ్. ఒకవేళ ఎవరి ఇంటి అవరణలో అయినా కొండ చిలువలు భోంచేసి పడుకుంటే వాటి జోలికి పోకుండా ఉంటే సరి. అటవీశాఖ అధికారులకి చెప్తే వాళ్ళు చూసుకుంటారు. ఈలోపు తొందరపడి మనం ఏమీ చెయ్యకుండా ఉంటేనే మేలు. ఏ కొండ చిలువకీ విషం ఉండదు. అలా అని రక్త పింజరకీ కొండ చిలువకూ వ్యత్యాసం తెలియకుండా, దగ్గరకు వెళ్ళకుండా ఉంటేనే మంచిది. రక్త పింజరకి విషం ఉంటుంది.