వినాయకుని పుట్టుక గురించి అందరికీ తెలిసిన కథ సంగతి అలా ఉంచితే, మనకు తెలియని కథలెన్నో ఉన్నాయి. అసలు ప్రాచీన పురాణ వర్ణనలో గజముఖుడు లేడు. గజ ముఖం ప్రస్తావన గణపతి అష్టోత్తరనామాలలో కనిపించదు. గజముఖుడైన వినాయకుని ఆవిర్భావం శివ పురాణాలలో ఉంది. పార్వతీమాత పిండిబొమ్మకు ప్రాణం పోయడం, శివుడు శిరస్సు ఖండించడం ఏనుగు తల అతికించడం, ప్రమథగణాలకు ఆధిపత్యం – అనే ఈ కథ భారతదేశం అంతటా బహుళ ప్రచారం పొందింది. తెలుగు కవి నన్నెచోడుడు కుమార సంభవం కావ్యంలో పార్వతీపరమేశ్వరుల లీలావినోదంగా గజరూపంలో క్రీడించగా గజముఖుడు జన్మించాడు అని చెప్పాడు. విఘ్నేశ్వరుడు ఆకాశం నుండి ఆవిర్భవించాడనేది వరాహపురాణ కథనం.
దేవకామినులను కూడా తన అందంతో భ్రమింపజేయడం వలన శివుడు, గణేశునికి ఏనుగు తలను కుండ లాంటి బొజ్జను కల్పించాడు అనేది మరొక కథ. కార్త్యవీర్యార్జునుని సంహరించిన అనంతరం పరశురామదేవుడు, పార్వతీపతి దర్శనార్ధం కైలాసం వచ్చాడు. పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో ఆది దంపతులను దర్శించడం వీలుపడదని గణాధిపతి నిరోధించాడు. వారిరువురి మధ్య జరిగిన యుద్ధంలో వినాయకుని దంతం భగ్నమయింది. నాటి నుండి ఏకదంతుడనే నామం స్థిరపడింది అని బ్రహ్మాండ పురాణం చెబుతోంది.
మూషికాసుర సంహార సమయంలో తన దంతాన్నే ఆయుధంగా ఉపయోగించడంతో, ఏకదంతునిగా మిగిలాడని దేవీ భాగవతంలో ఉంది. ఏకదంతం ద్వంద్వాతీత స్థితిని తెలుపుతుందని వేదాంతుల భావన, ద్వాపరయుగం నాటికి విఘ్నేశ్వరుని ఆరాధన స్థిరపడింది. శ్రీకృష్ణుని దివ్య చరిత్రలో శ్యమంతకమణి ఉపాఖ్యానం ఉంది. అవతార పురుషులు కూడా విఘ్ననాయకుని అర్చించవలసిందే.
గణపతి వ్యాస భగవానునికి రాయసకాడయ్యాడు. చేతిలో పక్షి ఈక రాత పరికరం. విదేశాలలో అటువంటి శిల్పాలున్నాయి, దీనినిబట్టి విఘ్ననాయకుడు విద్యాదాతగా ప్రసిద్ధుడు అయ్యాడు. వినాయకుడు బ్రహ్మచారి అయినప్పటికీ, సిద్ధి, బుద్ది – అనే భార్యలను కలిగి ఉన్నాడని చెప్తారు. అంటే, లోకకల్యాణ కారకాలయిన ఆ దివ్యశక్తులు వినాయకుని ఆధీనంలోనే ఉంటాయని చెప్పడం ఆంతర్యం అన్నమాట. అయితే ఆయన కేవలం కొన్ని శాస్త్రాలను చదవడం కోసం పెళ్లి అయి ఉండాలి కనుకనే పెళ్లి చేసుకున్నాడని, కనుక పెళ్లి అయినా కూడా ఆయన బ్రహ్మచారే అని చెబుతారు.