మహాభారతంలో ద్రౌపదికి అయిదుగురు భర్తలున్నరనే విషయం తెలిసినదే. అయితే, ద్రౌపదికి అయిదుగురు భర్తలు ఉండటం వెనుక అసలు కారణం మీకు తెలుసా? అయితే, ఈ ఆర్టికల్ చదవండి. మహాభారతం మొత్తం పాండవులు, కౌరవుల చుట్టూనే తిరుగుతుంది. ఈ ఎపిక్ లో మహాభారత యుద్ధం ముగిసే వరకు వివిధ సంఘటనలన్నీ పాండవులు, కౌరవులపైనే కేంద్రీకరించబడి ఉన్నాయి. మహాభారత యుద్ధంలో పాల్గొని గెలుపొందిన, ఓడిన పురాణ పురుషులపైనే మహాభారత ఇతిహాసం పరిభ్రమిస్తుంది. అసలు ఈ యుద్ధానికి ప్రధాన కారణమైన ఓ మహిళ. ఆ మహిళ వల్లే మహాభారత యుద్ధం జరిగిందని నానుడి. అవునండి, మనం ద్రౌపది గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ ఇతిహాసంలో ద్రౌపదిది చాలా శక్తివంతమైన పాత్ర. పాంచాల రాజ్య యువరాణి ద్రౌపది. పాండవుల ధర్మపత్ని. చాలా తెలివితేటలు, అణుకువ కలిగిన ద్రౌపది భర్తలపై అపారమైన గౌరవ మర్యాదలు కలిగినది.
ద్రౌపది గురించి విషయాలన్నీ అసక్తికరమైనవే. ఆమె అపారమైన సౌందర్యం, ఆమె దర్జా, ఆమె భక్తి ప్రపత్తులు, ఆమె ప్రేమ, ఆమె అవమానం, ఆమె ప్రతిజ్ఞ వీటికి సంబంధించి మహాభారతంలో చెప్పబడిన కథలన్నీ అబ్బురపరుస్తాయి. అన్నదమ్ములైన అయిదుగురుకి భార్యగా ఉండవలసిన పరిస్థితి ఎదురైన మహిళల ఆలోచనా స్థితి ఎలా ఉంటుందో ఉహించగలరా? కాని, ఇక్కడ ద్రౌపది విషయంలో అయితే మునుపటి జన్మ వరం కారణంగా ఆమె అయిదుగురు భర్తలకు భార్యగా ఉండవలసి వచ్చింది. ద్రౌపదికి అయిదుగురు భర్తలు పొందడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివుడి వరం గత జన్మలో ద్రౌపది ఒక మునికి జన్మించింది. ఆమెకు వివాహం జరగడం లేదని తీవ్రంగా దుఃఖించింది. ఆమెకు ఎంతకూ వివాహం కాకపోవడంతో జీవితంపై నిరాశ చెంది మహాశివుడి కోసమై తపస్సు ప్రారంభించింది. దీర్ఘకాల తపస్సు తరువాత మహా శివుడు ఆమె తపస్సుకు మెచ్చి దర్శనమిచ్చి ఒక వరాన్ని ప్రసాదించాడు.
ఆమె అయిదు లక్షణాలు కలిగిన వరుడిని భర్తగా ప్రసాదించమని మహాశివుడిని వేడుకుంది. తనకు కాబోయే భర్తకు అయిదు లక్షణాలు ఉండాలని ద్రౌపది వేడుకుంది. నీతి, ధైర్య సాహసాలు, అందమైన, విజ్ఞానం కలిగిన, అమితమైన ప్రేమ కురిపిస్తూ దయా హృదయం కలిగిన వ్యక్తిని భర్తగా ప్రసాదించమని కోరుకుంది. ఆమె కోరిక విన్న మహాశివుడు ఒక్క క్షణం అలోచించి ఈ అయిదు లక్షణాలు కలిగిన వరుడు దొరకడం కష్టమని భావించాడు. అందువల్ల ఆమె మరుజన్మలో విడివిడిగా ఈ అయిదు లక్షణాలు కలిగిన అయిదుగురు పురుషులు ఆమెకు భర్తగా లభిస్తారని వరమిచ్చాడు. అందువల్ల ద్రుపద రాజుకు ద్రౌపది జన్మించినప్పుడే ఆమెకు అయిదుగురు భర్తలుంటారని అప్పటికే విధి నిర్ణయించింది. పురాణాలలో అప్పట్లో బహు భార్యత్వం, బహు భర్తృత్వం అనే ఆచారాలున్నట్లు చెప్పబడింది. ఈ అంశాన్నిమనం విస్మరించకూడదు. భారత్ లోని ఉత్తర-పశ్చిమ ప్రాంతాలలోని అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉన్నచోట ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
ఇప్పటికీ ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా వంటి ప్రాంతాల్లో అమ్మాయిల సంఖ్య అబ్బాయిల సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువ. పురాణాలలో చెప్పబడే హస్తినాపురమనే ప్రదేశం ఈ ప్రాంతాలకు దగ్గరగానే ఉండేది. అందువల్ల, ద్రౌపది అయిదుగురు భర్తలను కలిగి ఉండడానికి గల కారణాలలో అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండేదన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. స్వయంవరంలోని ద్రౌపదిని గెలుచుకుని ఇంటికి వచ్చిన అర్జునుడు తన తల్లి వద్దకు వచ్చి అమ్మా, చూడు నేనేం తెచ్చానో అనంటాడు. కుంతీ దేవి ఏదో ఆలోచిస్తూ అర్జునుడు దేని గురించి చెప్తున్నాడో చూడకుండా ఎం తెచ్చినా అన్నదమ్ములతో పంచుకోమని ఆదేశిస్తుంది. అలా తల్లి మాటకు విలువిస్తూ అయిదుగురు అన్నదమ్ములు ద్రౌపదిని వివాహమాడతారు. మహాభారత యుద్ధాన్ని ఐకమత్యంతో ఎదుర్కొనమని కుంతీ దేవి తన పుత్రులకు సలహా ఇచ్చిందనే భావించవచ్చు. త్వరలో యుద్ధం రాబోతుందన్న విషయం కుంతీకి తెలిసే ఉండుంటుంది. ద్రౌపాది అపార సౌందర్యం అన్నదమ్ముల వల్ల కలహాలను సృష్టిస్తుదని కుంతీ భావించి ఉండవచ్చు. అందరూ ద్రౌపదిపై ఆశపడ్డారన్న విషయాన్ని కుంతీ గ్రహించి ఈ విధమైన సలహా ఇచ్చి ఉంటుందని అంటారు. వ్యూహాత్మకంగా కుంతీ ఆదేశం వల్ల అన్నదమ్ములు ఐకమత్యంతోనే కలిసున్నారు.