ఇటీవలే అమెరికాలోని పోషకాహార నిపుణులు తెల్లటి బియ్యం తినే వారికి టైప్ 2 డయాబెటీస్ వ్యాధి వస్తుందని ఒక రీసెర్చిలో వెల్లడించారు. తెల్లటి బియ్యం బదులుగా బ్రౌన్ రైస్, లేదా ఇతర గింజధాన్యాలు తింటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు మూడొంతులు తగ్గుతాయన్నారు. తెల్లటి అన్నం రక్తంలో షుగర్ స్ధాయి పెంచేస్తుందని, బ్రౌన్ రైస్ లేదా ఇతర గింజ ధాన్యాల ఆహారం క్రమేణా మెల్లగా ఎనర్జీలను వదిలి రక్తంలోని షుగర్ స్ధాయిని సాధారణంగా వుంచుతాయన్నారు.
వీరు చేసిన పరిశోధనలో షుమారు రెండు లక్షలమంది అమెరికన్లను వినియోగించారు. వారానికి 150 గ్రాముల తెల్లని అన్నం తినే వారిలో 17 శాతం డయాబెటీస్ అధికంగా వచ్చే అవకాశం వున్నట్లు తేలింది. డయాబెటీస్ నిరోధించాలంటే, తాజా పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు వుండే ఆహారాలు, తక్కువ షుగర్ ఆహారాలు చక్కని పరిష్కారమని డా. విక్టోరియా కింగ్ డయాబెటీస్, ఇంగ్లాండ్ సంస్ధ తెలిపింది.
ప్రధానంగా మనం తినే ఆహారం ఎటువంటిదనేది శ్రధ్ధ పెట్టాలని తెల్లని అన్నంలో అధికమైన గ్లైసీమిక్ ఇండెక్స్ వుందని అది ఒక్కసారిగా ఎనర్జీని రక్తంలోకి వదిలేసి షుగర్ స్ధాయి పెంచుతుందని వీరు వెల్లడించారు. ఇప్పటికే అమెరికా, ఇంగ్లాండ్ దేశాలలో షుమారు 70 శాతం తెల్లటి అన్నం తింటున్నారని దీనిని బ్రౌన్ రైస్ లేదా గింజ ధాన్యాల ఆహారంతో మార్పు చేస్తే టైప్ 2 డయాబెటీస్ రాకుండా వుంటుందని పరిశోధకులు రుజువు చేసినట్లు లండన్ లోని డైలీ డయాబెటీస్ న్యూస్ ఇన్ సైడర్ జర్నల్ పేర్కొంది.