రాతియుగం మానవుడి ఆహారం తీసుకుంటే, గుండె జబ్బుల రిస్కు తగ్గుతుందని ఒక కొత్త స్టడీ వెల్లడించింది. తాజా మాంసం, వెజిటబుల్స్, బెర్రీలు, కాయలు మొదలైన రాతియుగం నాటి మానవుని ఆహారం మూడు వారాలపాటు తీసుకుంటే గుండె పోటు అవకాశాలు తగ్గిస్తుందని పరిశోధకులు తెలుపుతున్నారు. ఈ ఆహారం యిచ్చి చేసిన పరిశోధనలలో తిన్నవారు బరువు తగ్గటం, రక్తపోటు తగ్గటం, రక్తం గడ్డకట్టే పదార్ధాల స్ధాయి పడిపోవటం మొదలైన మార్పులు వచ్చాయని సైంటిస్టులు తెలిపారు.
ఈ పరిశోధనా ఫలితాలు, యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ జర్నల్ లో కూడా ప్రచురించారు. శతాబ్దాల పాటు మన పూర్వీకులు మాంసంపైనా లేదా చెట్లు, మొక్కలనుండి సేకరించిన పదార్ధాలపైనా జీవించారు. నేటికి మానవ శరీరం ఈ రకమైన పదార్ధాలు తిని జీవించేందుకు రూపొందించబడిందిగానే వుందని సైంటిస్టులు చెపుతున్నారు.
అంటే, పండించిన ధాన్యాలు లేదా బ్రెడ్, పాలు, వెన్న, జున్ను లేదా పంచదార మొదలైనవి ఏమీ శరీరానికి అవసరం లేదు. కావలసిందల్లా తాజా మాంసం, చేపలు, పండ్లు, వెజిటబుల్స్, కాయలు మొదలైనవి మాత్రమే. ఈ రకమైన ఆహారం మానవుడికి హృదయ సంబంధిత వ్యాధులు నయం చేయగలదని అయితే, ఇవి మాత్రమే తింటే పాల ఉత్పత్తులలోని కాల్షియం శరీరానికి చేకూరదని. ఈ కారణంగా ఎముకల వ్యాధి అయిన ఆస్టియోపోరోసిస్ ఖచ్చితంగా వచ్చే అవకాశం వుందని స్టడీ నిర్వహించిన డా.పర్ వెండల్ వెల్లడించారు.